గిరిజనాభివృద్ధి జరగాలంటే.. స్థానిక వనరుల వినియోగించాలి

గిరిజనప్రజలైన..సామాజికకార్యకర్తలైన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమైన గిరిజనాభివృద్ధి జరగాలంటే ఏజెన్సీలో నిక్షేపమైన వనరులు స్థానిక గిరిజనులే వినియోగించు కొనేలా వారికే రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలి.స్థానిక వనరుల వినియోగంపై గిరిజనులను చైతన్యవంతులను చేసేలా చర్యలు చేపట్టాలి. ఐదవషెడ్యూల్‌ ఏరియాలో నివసించే గిరిజనులకు ప్రధానజీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.గతంలో ప్రతీగిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూవస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో,గిరిజనుల హక్కులపట్ల చైతన్యం కలిగించి,గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘ టించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు,పర్యావరణ పరిరక్షణ,వారిహక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. అయినా పీసాచట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి,రాజ్యాంగానికి విరుద్దంగా,వారి వనరులపై గిరిజనేతరుల పెత్తనం సాగుతూనే ఉంది. ఫలితంగా పచ్చని పొలాలపై మైనింగ్‌ చిచ్చు రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎండీసీ) మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్నయుద్దం జరుగుతూనే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో నిమ్మలపాడు కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ,జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏప్రిల్‌ 19న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్దింటే సమత జడ్జెమెంట్‌ ప్రకారం స్థానికులకే లీజులు అప్పగించాలంటూ గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. నిజానికి గిరిజనుల ఆవేదనకు అర్ధముంది. సమత తీర్పును ప్రభుత్వంగానీ,ఏపీఎండీసీ అధికార యంత్రాంగం గానీ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.ఆతీర్పు పూర్తిగా చదివితే మైనింగ్‌ తవ్వకాలపై సమత జెడ్జి మెంట్‌ వ్యతిరేకం కాదని అర్ధమౌతోంది.రాజ్యాంగబద్దంగా గిరిజన ప్రాంతానికి చెందిన వనరులు గిరిజనులకే చెందాలని, ఒకవేళ వనరులు వెలికితీస్తే గిరిజనులను సొసైటీలుగా ఏర్పాటు చేయించి,వారికే లీజులు ఇవ్వాలని ఆతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కోంది.ఈతీర్పును అర్ధం చేసుకోకుండా గిరిజన బినామీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజులు ఇవ్వడానికి ఏపీఎండీసీ మొగ్గు చూపుతోంది.
పదహారేళ్ల నుంచి స్థానిక గిరిజన సొసైటీలకు లీజులు ఇవ్వకుండా ఏపీఎండీసీ స్థానికేతర గిరిజనులకే లీజులు ఇవ్వడంపై కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామాల గిరిజన ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వారి అమయకత్వం కారణంగా వనరుల దోపిడికి గురవుతునే ఉన్నారు. ఈ మూడు గ్రామాల మధ్య 125 ఎకరాల్లో విలువైన కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది.వీటిని చేజిక్కించుకోవడానికి మైనింగ్‌ మాఫియా ఏపీఎండీసీ అండతో మూడు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దోపడి వ్యవస్థకు స్వస్తిపలికి ఏపీఎండీసీ అధికార్లు రాజ్యాంగనీతిని అనుసరించాలి.నిజమైన గిరిజనాభివృద్ధిని సాధించాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్థానిక వనరులను వినియోగించి అభివృద్ధి చేయాలి.పీసా,సమత జడ్జెమెంట్‌ స్పష్టం చేసిన తీర్పును అర్ధం చేసుకొని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న వనరులు స్థానికులకే హక్కు కలిగేలా చర్యలు తీసుకోవాలి.వారి వనరులు వారికే చెందేలా గిరిజన సొసైటీలుఏర్పాటు చేయించి,గిరిజనులకు లీజులు ఇచ్చిప్రొత్సహించాలి. అప్పుడే గిరిజన ప్రజలు ఆశించిన నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దశగా ఏపీఎండీసీ,రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్

ఎస్టీల గుర్తింపులో తొందరపాటు సరికాదు !

బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీలు)గా గుర్తించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.బోయలు, వాల్మీకులు మరియు బెంథో ఒరియాల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని పరిశీలించడానికి ఒక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది మరియు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా,వారిని ఏపీ ఎస్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గిరిజన సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.సాధారణ కోర్సులో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏ(9) ప్రకారం అవసరమైన షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌తో ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంప్రదింపులు జరగిన దాఖలాలు కన్పించలేదు.రాష్ట్రం నియమించిన కమిషన్‌ ఈఅంశంపై తమ అభిప్రాయాలను కోరలేదని,రాష్ట్ర ప్రభుత్వం తమను ఎప్పుడూ విశ్వాసంలోకి తీసుకోలేదని గిరిజన సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ఐదవ షెడ్యూల్‌లోని పారా4కింద ఏర్పాటైన గిరిజన సలహా మండలి పరిగణలోకి తీసు కున్న అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలుస్తోంది.ఎస్సీ,ఎస్టీలజాబితాల సవరణపై జస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలోని కేంద్ర సామాజిక భద్రత విభాగం 1965లో నియమించిన అడ్వైజరీ కమిటీ,ఆదివాసీల సమూహాన్ని వర్గంగాగుర్తించాలా? వద్దా? అనే విషయాన్ని గుర్తించేందుకు అవసరమైన కొన్ని లక్షణాలను సూచించింది.కొత్త సమూహాలను షెడ్యూల్డ్‌ తెగలలో సభ్యులుగా చేర్చాలని స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడిని పరిగ ణనలోకి తీసుకున్నారు. అయితే దీనిని పరిశీలించడానికి రాష్ట్రం ఆదివాసీల సంస్కృతి గురించి తెలిసిన బయటి నిపుణులతో ఒకకమిటీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉండేది.ఈ నేపథ్యంలో,షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌టీ)ఈ విషయంలో జోక్యాన్ని కోరే స్వేచ్ఛ గిరిజన తెగలకు ఉంది.ఎన్‌సీఎస్‌టీ వన్‌ మ్యాన్‌ కమీషన్‌ నివేదికను వృత్తిపరంగా ఆదివాసీల సంస్కృతి,జీవితాల గురించి తెలిసిన బయటి ప్రముఖ నిపుణుల బృందానికి సూచించమని గిరిజనతెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోతున్నాయి.ఈ విషయంలో కనీసం గిరిజన సలహా మండలి(టీఏసీ) అభిప్రాయాలు తీసుకున్న దాఖలులేవు.
ఏదైనా తుదినిర్ణయం తీసుకునే ముందు ఏస్టీ జాబితాలో కొత్త సమూహాలను చేర్చడం వలన వారి అవకాశాలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, రాష్ట్రం స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 1965లో లోకూర్‌ కమిటీ సంప్రదించిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుత ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏస్టీల జాబితాలో ఏదైనా సమూహాన్ని చేర్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(1) (రాజ్యాంగం (మొదటి సవరణ) చట్టం,1951 ద్వారా సవరించబడిన ప్రకారం)రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడంచాలా అవసరం.దీనిపై ఎన్‌సిఎస్‌టి పరిశీలించిన అభిప్రా యాలను కోరాలని కేంధ్ర ఇంధన వనరులశాఖ విశ్రాంతి ముఖ్యకార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏలో 9వ అంశం ప్రకారం జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ను సంప్రదించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆదివాసీలుకాని వారిని ఎస్టీలుగా గుర్తించడంవల్ల తమ హక్కులకు హాని కలిగే అవకాశముందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారి ప్రతినిధులతో సంప్రదింపలు జరిపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20 నగరాల మొదటి జాబితాను ప్రకటించారు దేశ్యాప్తంగా అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌,పూణే,కోయంబత్తూర్‌,జబల్‌పూర్‌, జైపూర్‌, సూరత్‌, గౌహతి,చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, ఇండోర్‌,భోపాల్‌,ఉదయపూర్‌,లూథియానా,కాకినాడ,బెల్గాం,షోలాపూం,భువనగిరి మొత్తం20 నగరాలున్నాయి.
ఇవి సిటీ పౌరులకు సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. డేటాను సేకరించేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ పద్ధతులు,సెన్సార్లు ఉపయోగించబడతాయి. అందుకున్న డేటా అంతర్భాగం చెత్త సేకరణ,వినియోగ సరఫరా,ట్రాఫిక్‌ కదలిక,పర్యావరణ నిర్వహణ,సామాజిక సేవల నిర్వహణలో కార్యాచరణ మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌,గవర్నెన్స్‌,రవాణావ్యవస్థ,భద్రత కోసం మెరుగైన నిఘా,స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు,మెరుగైన ఉద్యోగావకాశాలు,సౌకర్యవంతంగా జీవించే ప్రతి ఇతర సౌకర్యాలు కల్పిస్తాయి.
వాస్తవానికి స్మార్ట్‌ సిటీ అంటే ప్లానింగ్‌ పక్కాగా ఉండాలి.కానీ ఎక్కడ ఏం జరుగుతుందో..ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఏపీలో కీలక నగరమైన విశాఖపట్నంలోనే.స్మార్ట్‌సిటీలో నిరుపేదలు జీవించే పరిస్థితులు లేకుండా పోతుంది. నగరానికి జీవనోపాధి పొట్టకూటి కోసం వచ్చే వలసవాదులు,బీక్షాటన చేసే బిక్షగాళ్లకు సరిjైున సదుపాయాలు లేక రోడ్డుజంక్షన్లవద్దనే భిక్షాటన చేయడం శోచనీయం.వీటికి చట్టాలున్నా శూన్యంగానే ఉంది. మరోపక్క చెత్త,చెదారం,ఆహార వ్యర్ధాలు విచ్చలవిడిగా పడేయడంవల్ల నగరమంతా అస్తవ్యస్థంగా మారుతోంది. స్మార్ట్‌సిటీ అంటే చెత్తరీసైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలి.కానీ ఆపరిస్థితి విశాఖలో కన్పించడం లేదు.స్మార్ట్‌సిటీ అంటే కేవలం మెయిన్‌ రోడ్లుకు మరమ్మతులు,డివైడర్ల మధ్య పూల మొక్కలు,ప్రగహారీగోడలకు రంగులు వేయడమేనా?నగరాన్ని ఆనుకొని ఉన్న మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ లింక్‌ రోడ్డు నిర్మిణాలు ఎక్కడ జరుగుతున్నాయి? పచ్చని చెట్లు నరికేసి మొదళ్లు,మోడులకు రంగులు వేయడం అవసరమా?.అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితమైయ్యింది.నగర నడిబొడ్డునఉన్న ఎన్నో షాపింగ్‌ మాల్స్‌,దుకాణాల్లోను ప్లాస్టిక్‌ తాండవి స్తోంది.దీంతో నగరపరిసరాలన్నీ ప్లాస్టిక్‌మయంగా మారింది.పరిశ్రమల నుంచి వెలువడే కాలు ష్యకారకాలు,వాహన శబ్దకాలుష్యాలు నగరాన్ని రాజ్యమేలు తున్నాయి.

జగనన్న ఇళ్లు స్థలం పేరుతో నగరంలో జీవిస్ను నిరుపేదలను3040కిలోమీటర్ల దూరంలో అభయారణ్యాల మధ్య నగరం నుంచి గెంటేశారు. వీరంతా నగరంలో చిన్నచితక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేదలే.ఇప్పుడంతా వారు నిర్వాసితులయ్యారు. ఉన్నచోటనే నిరుపేదలకు ఉపాధి,ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ పేరుతో పేదలను నగరం నుంచి గెంటేయడం ఎంతవరకు సమాంజసం. ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌,పబ్లిక్‌ సేఫ్టీ,స్మార్ట్‌ మొబిలిటీ,పెరిగిన టూరిజం,సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,ఫిజికల్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీలుగా మార్చడాన్ని సులభతరం చేస్తాయి.కానీ నగరాన్ని ఆనుకొని స్మార్ట్‌సిటీలో విలీనమైన దబ్బంద గ్రామంలో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నిల్‌ రావడం లేదు.దీనివల్ల అనేక మంది నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు సక్రమంగా పొందలేకపోతున్నారు.

ఈనెల 28,29,30తేదీల్లో జరిగే జీ20సదస్సుకు కోసం జీవీఎంసీ రూ.150కోట్లతో నగరాన్ని సుందరీకరణ చేస్తుంది కానీ అస్తవ్యస్థంగా పడి ఉన్న చెత్త,ప్లాస్టిక్‌ సేకరణలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.సేకరించిన చెత్త,ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం శాస్త్రీయమైన రీసైక్లింగ్‌ పద్దతులను పాటించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అవశ్యకత ఎంతైనాఉంది.అప్పుడే స్మార్ట్‌సిటీ ప్రయోజనాలు ప్రజలకు సమకూరుతాయి. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

ప్లాస్టిక్‌ ముప్పు..ఎప్పుడో కనువిప్పు..!

రోజూ అన్ని అవసరాల కోసం ఓచిన్న గిరిజన గ్రామం నుంచి నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉదయం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవసరాలకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం.ఆశ్చర్యమేమంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తంభద్రపరచే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నాకూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూ అదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని కుగ్రామాలే కాకుండా టూరిజం,సందర్శన, కాఫీతోటలు,విహారయాత్రి స్థలాలు ప్లాస్టిక్‌మయంగా మారుతున్నాయి. ఇలా నింగి,నేల,నీరులోరేణువులుగా మారుతూ ఆరోగ్యానికి పెనుసవాల్‌ విసురుతున్నాయి.
నేను ఏజెన్సీప్రాంతానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్‌గ్రామాల్లో గిరిజనులు తమ అవసరాల కోసం దాచుకొనే నగదును పూర్వం వెదురు బొంగుల్లో దాచుకునేవారు.నేడు ఆపరిస్థితి భిన్నంగా మారింది. ప్లాస్టిక్‌ సంచుల్లో చుట్టుకొని నగదును దాచుకుంటున్నారు.ఆనాడు ప్లాస్టిక్‌ అంటే సారా ప్యాకెట్లులే కన్పించేవి.ఇప్పుడు విచ్చలవిడిగా అన్నీరకాల నిత్యావసర సరకులు,ఆఖరికి టీ,ఆహారపదార్ధాలు ప్లాస్టిక్‌ సంచులనే దర్శనమిస్తున్నాయి.ప్లాస్టిక్‌లేనిదే జీవితం నడవడం లేదనే స్థాయికి పేరుకు పోయింది. పాస్టిక్‌తో పాటు చెత్త పేరుకుపోతోంది. నేను1997వరకు పాడేరులో నివాసము ఉన్నప్పుడు చెత్త,ప్లాస్టిక్‌ ఎక్కడబడితే అక్కడ డంప్‌ చేసేవారు. అయితే డపింగ్‌ చేసే చెత్త,ప్లాస్టిక్‌ విషయంలో శాస్త్రీయపద్దతిని పాటించడం లేదు.శాస్త్రీయపద్దతిలో చెత్తను వినియోగించడమనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవశ్యకత ఉంది.ఇది పర్యావరణానికి,మానజీవితానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.లేకపోతే చెత్త విస్తరించి వర్షకాలంలో వాగులు,గెడ్డలు,డ్రైయినేజీల్లో పొంగి ప్రవహించినప్పుడు ఆ చెత్త జలాశాయాల్లోకి చేరి త్రాగు,సాగునీటిని కలుషితం చేస్తుంటాయి.దీనిద్వారా కేవలం గిరిజనప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితంగా మారే ప్రమాదం పొంచిఉంది.ఇప్పటికే తాటిపూడి, మేగాద్రిగెడ్డ,రైవాడ,ఏలేరు కాలువ,వంటి జలాశాయల నుంచి నగరానికి,మైదాన ప్రాంతానికి తరలిస్తున్న త్రాగు,సాగునీటివనరుల్లో చెత్త,ప్లాస్టిక్‌ చేరి కలుషితమవుతున్నాయి.ఈ నీటినే నగర/పట్టణ ప్రాంతాల ప్రజలు మంచినీళ్లుగా తాగుతున్నారు.
మైదాన ప్రాంతాల నుంచి ఈ మిగుల జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ఆ జలాలతో ప్లాస్టిక్‌,చెత్తచెదారాలు సముద్రంలోకి చేరి జీవరాశులు కాలుష్యానికి గురవుతున్నాయి.ఇటీవల ఓ పరిశోధనలో తిమింగలం కడుపులో ప్లాస్టిక్‌ సంచులు కన్పించినట్లు తెలిపింది.కేవలం ప్లాస్టిక్‌ మాత్రమే కాదు..చెత్త కూడా ప్రజల జీవిన విధానానికి హానికలిగిస్తోంది.వీటి నియంత్రణకు ప్రభుత్వం సరిjైున శాస్త్రీయ పద్దతులు అవలంబించాలి.మన అవసరాలను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన లేదు. పర్యావరణానికి భంగం కలుగకుండా ఈభూగోళాన్ని తర్వాత తరాలకు అందించే దృష్టితో,సమకాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలనే ఆలోచనాలేదు.
ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది.వీటిలో ఏప్రిల్‌ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్‌ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈపన్ను కింద ప్లాస్టిక్‌లో వస్తువులను ప్యాకింగ్‌ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతోపాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలు ఈ కార్పొరేట్‌,శాసనవిధానాలపై విశ్లేషణ ఈకంపెనీలు రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడ తాయని నిర్ధారించింది. అయినప్పటికీ పరిస్థితులు షరామామూలే.చెత్తలో పలురకాలు ఉన్నాయి. వాటిని విభజించి రీసైక్లింగ్‌ చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై హక్కుకోసం పోరాటం చేశారు. తర్వాత 1932లో జమీందారు వ్యవస్థ హాయంలో ప్రముఖ సామాజికవేత్త రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ విశాఖ మన్యప్రాంతాన్ని సందర్శించి అమాయక గిరిజనులు దోపిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారి రెబ్బాప్రగడ కృష్ణారావు అటవీ సంరక్షణ అధికారిగా చింతపల్లి,మినుములూరు,అనంతగిరి,పాడేరు,మారేడిమిల్లి వంటి గిరిజనప్రాంతాల్లో విధులునిర్వర్తించారు. ఆయన హాయంలోనే కాఫీతోటలు పెంపకాన్ని ప్రవేశ పెట్టి జీవనప్రమాణాలు మెరుగుపరిచారు.నేను చిన్నప్పటి నుంచే నాన్నగారితోకలసి ఆదివాసుల జీవనవిధానాలతో మమేకమ య్యాను. తరాలుగా అడవితల్లినీడలో బతుకుతున్న అటవీభూములపై హక్కుమాత్రం వారికి ఎండ మావిగానే మిగిలాయని గుర్తించాను. ఈనేపథ్యంలోనే సమత పుట్టికొచ్చింది.గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు పరిరక్షణపై గత ముప్ఫైరెండేళ్ల నుంచి పోరాడుతుంది. విశాఖమన్యంలో బాక్సైట్‌,ఖనిజనిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు ధారతత్తం చేసినవైనాన్ని గుర్తించి అటుప్రభుత్వం,ఇటు ప్రైవేటు బహుళజాతికంపెనీలకు వ్యతిరేకంగాపోరాడిరది.ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,హక్కులు నిర్వీర్యమైపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిగా గిరిజనుల హక్కులను పునరుద్దరిస్తూ సర్వోన్నత (న్యాయస్థానం) సుప్రింకోర్టు చరిత్రాత్మకమైన1997లో సమత తీర్పు నిచ్చింది. నేడు ఈతీర్పుఫలితంగా భారతదేశంలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు రక్షణ గా నిలిచింది.స్థానికులైన గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిరది. సామా జిక,ఆర్ధిక న్యాయం కోసంపోరాడే ఆదివాసులకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది.ఈతీర్పును ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు యథాశక్తి ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది.అధికారంలోఉన్న ప్రభుత్వంఅటవీ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రక్షణ చట్టాలను సవరించడం తీరని అన్యాయం.
అడవులతో గిరిజనులకు పెనవేసుకుపోయిన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. అమాయకాదివాసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పొందుపరిచన సూత్రావళి స్పూర్తిని మన పాలకులు అడ్డంగా విస్మరిస్తున్నారు. అడవులు,ఆదివాసులు అధికంగాఉన్న ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీషఘడ్‌,ఒరిస్సా,జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ పరిశ్ర మల ఏర్పాటుకు,ఖనిజతవ్వకాలకు విచ్ఛలవిడిగా లాకులెత్తుతున్నారు.ఆస్మదీయుల,పెట్టుబడిదార్ల జేబులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల అగ్రహానికి గురవుతున్నారు.అడవులవృద్ధి,పరిరక్షణద్వారా ఒనగూడే ఆర్ధికప్రయోజనాలను గిరిజనులకు చేర వేయాలంటూ స్వాతంత్య్రానంతరం నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ,తీసుకునే ప్రతినిర్ణయమూ సామాన్యునికి ఎంతోకొంత ఉప శమనం కలిగించాలి.వారి సమస్యలకు పరిష్కారంచూపాలి. కానీ,నేడు గిరిజన సంక్షేమం,అడువుల పరిరక్షణ పేరిట పాలకులు చేపడుతున్న చర్యలు ఆదివాసులకు న్యాయం చేయడం లేదు సరికదా..,వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అటవీ వనరులను అయినవారికి దోచిపెట్టడానికి,ప్రకృతి వనరుల పరిరక్షణపేరిట నిధులుస్వాహాలు,సర్కారీ పెద్దలుతెగబడుతున్న నైచ్యం నేడు బహిరంగ రహాస్యం.తమకు నిలువ నీడలేకుండా పాపం చేస్తున్నదెవరో గ్రహించలేనంతటి అమాయకత్వంలో ఈనాటి గిరిజనులులేరు.వారుఅన్నీ చూస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు. అక్రమార్కులకు వంతపాడుతూ అడవి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న పెద్దలు తీరు మార్చుకోవాల్సిన తరుణమిది!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

వివాదాస్పద సంస్కరణలు`అటవీ చట్టం సవరణలు

భారత దేశంలో అధికంగా నివసించే ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైన వనరులు,గనులు, ఖనిజాలు,నీటివనరులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే! దేశంలో ఉన్న అటవీ పరివాహక ప్రాంతాలన్నీ గిరిజన జీవనవిధానంతో ముడిపడి ఉంది.ఎన్ని వనరులున్నా అక్కడ నివసించే గిరిజనుల పరిస్థితుల్లో మార్పులేదు.భారత రాజ్యాంగంలో గిరిజన,దళిత తెగలకు రక్షణ కవచం లాంటి చట్టాలను పొందిపరిచాయి.రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకొనేందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ కూడా ఏర్పాటైంది.ఇన్ని వ్యవస్థలున్నప్పటికీ గిరిజనులు అన్యాయానికి గురవు తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు,జిల్లాలు విభజన నేపథ్యంలో వారి జీవితాలు ఛిన్నాభిన్నమైంది.వలస పక్షుల్లా విలవిలలాడుతున్నారు.పాలకుల స్వార్ధ రాజకీయాలకు బలైపోతున్నారు.
ఆదివాసీల జీవనవిధానం అడవితో ముడిపడిఉంది.అయితే అడవిలోసంస్కరణల అలజడి.. చట్టంలో కీలక మార్పులు జోరందుకున్నాయి.94 ఏళ్ల చరిత్ర గల భారతీయ అటవీ చట్టం1927 (ఐఎఫ్‌ఏ) సవరణలకు ఉపక్రమించారు. ఈచట్టం అన్నీ రకాల వ్యవస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అటవీ సంరక్షణ నియమాలు2022 పేరుతో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలపై తీవ్రమైన ప్రభావంచూపుతోంది.కోట్లాది మంది గిరిజనులను అడవుల నుంచి గేంటేసి పరిస్థితులు దాపురించనున్నాయి. అడవులు,అటవీ సందపను బదలాయింపు చేస్తే అటవీ సంక్షరక్షణ చట్టం(1980)లో కఠినంగా నిబంధనలున్నాయి. ఈ నిబంధనలను తొంగలోకి తొక్కి అటవీ సంపదను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పాలకులు కుట్రపన్నుతున్నారు. ఈ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా గిరిజ నులు వ్యతిరేకిస్తున్నా పాలకులు పెడచెవినపెడుతున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే అడవులపై ఆధారపడ్డ కోట్లాదిమంది గిరిజనులు బలవంతంగా గెంటివేతకు గురవుతారు. ముఖ్యంగా షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలువైన మైనింగ్‌,ఖనిజ సంపదను అంబానీ,ఆదాని వంటి కార్పొరేట్లకు కట్ట బెటేందుకు ఈబిల్లును తీసుకొస్తున్నదని గిరిజన తెగలు భావిస్తున్నాయి. అటవీ భూమిని పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టాలంటే 1980చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతబిల్లులో ఆనిబంధనలన్నింటిని సరళతరం చేస్తూ సింగిల్‌ విండో విధానం ద్వారా కేంద్ర క్యాబినేట్‌ ఆధ్వర్యంలో వేసిన ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అనుమతి అవసరం. ఈ నిబం ధనలు బదలాయించాలంటే జాతీయ ఎస్టీ కమిషన్‌(ఎన్‌ఎస్‌టీ) అనుమతులు తప్పనిసరి. ఎన్‌ఎస్‌టీ అనేది ఆర్టికల్‌338ఎ ప్రకారం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ అధికారం. ఆ ఆర్టికల్‌లోని క్లాజ్‌(9) ప్రకారం యూనియన్‌,ప్రతి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషను సంపద్రించాల్సిన అవశ్యకత ఉంది.రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా,కమిషన్‌ సూచనలను అంగీకరించాలి.ఒక వేళ కమీషన్‌తో విభేదించాలని అనుకుంటే దానికి గలకారణాలను స్పష్టంగా పేర్కొనాలి.కమిషన్‌ అధికారిక నిబంధనలకు ధీటుగా బిల్లుతోపాటు పార్లమెంటు ముందు ఉంచాల్సిన అవసరం ఉంచాలని ఇప్పటికే పలువురు మేథావులు,గిరిజన సంస్థలు,సంఘాలు రాష్ట్రపతికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే! ఈ పరిస్థితిల్లో అడవి బిడ్డలకు అండగా ఉన్నట్టు కనబడే ఈ చట్టం,వాస్తవానికి వారికిఅడవి తల్లికి మధ్య ఉన్న బంధాన్ని పావుగా ఉపయోగించుకుంది.ఫలితంగా ఇన్నేళ్లూ వారు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారనే వాదనలున్నాయి. ప్రైవేటు సంస్థల హక్కులను పెంచే దిశగా ఉండటం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవేమీ ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రయత్నం అడవి బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,థింసా 

ప్లాస్టిక్‌ రహితం..ఇంకెంత దూరం.?

దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నా మంటూ ప్రభుత్వాలు ప్రకటించటం..ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది.అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పుపొంచి ఉంటోంది. ఇలా నిత్య జీవన విధానం ఫాస్టిక్‌ మయంగా మారింది.రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.
మొన్నటి వరకు సముద్రాలు,నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడు కున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులువచ్చాయి. మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పాలల్లో దీని అవశేషాలున్నట్లు గుర్తించడం విశేషం. ప్లాస్టిక్‌,కాలుష్యం అధికమై వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మంచుకొండలు కరిగిపోయి సముద్రంనీటిమట్టం పెరిగిపోతుంది. అకాలతుఫాన్లు ప్రభావంతో యావత్తు ప్రపంచ దేశాలు అతాలకుతలమై పోతున్నాయి.
జశీఅటవతీవఅషవ శీట ్‌ష్ట్రవ ూaత్‌ీఱవం (కాన్ఫెరెన్స్‌ఆఫ్‌ ద పార్టీస్‌)దీనినే షార్ట్‌గా (కాఫ్‌) జూఅని పిలుస్తారు. ప్రతిఏటా197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది.వాతావరణ మార్పులు,దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.ఇలాంటి సదస్సలు ఇప్పటి వరకు 26 జరిగాయి. కాఫ్‌సదస్సుల్లో ఎన్నినిర్ణయాలు తీసుకున్నా ఏదేశం కూడా అమలు పర్చడంలో నిర్లక్ష్యవైఖరి అవలంబించడం శోచనీయం.
అంతర్జాతీయంగా మానవజాతిని అవహిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో బాన్‌ చేయాల్సిన అవసశ్యకత ఎంతైనా ఉంది.ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నమని ప్రగాల్బలు పలికే దేశాలు,రాష్ట్రాలు కేవలం ముక్కుబడిగానే అమలు చేస్తున్నాయి తప్పా కఠినమైన వైఖరిని అవలంబించడం లేదనే అందరికీ తెలిసిన విషయమే.ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంతో ప్లాస్టిక్‌ ముడిపిడి ఉంది.దీని నియంత్రణకు చట్టాలు,ప్రభుత్వాలున్నాయి.ఐక్య రాజ్య సమితి సైతం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.అయినా మానవ జాతిలో మార్పులురావడం లేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి,చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ,సముద్రాలు,చెరువులు,నదులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపో తున్నాయి. ఫలితంగా యావత్తు మానవ శిశువులతోపాటుగా,జంతువులు,పక్షులు,జలచరాలు,కీటకాలు అన్ని చనిపోతున్నాయి.ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం తూర్పు కనుమల్లో గిరిజన ప్రాంతాలు ప్రకృతి అందాలో ఆహ్లాదక రంగా ఉండేది. ప్రస్తుతం నేడుకొండకోనల్లోను ప్లాస్టిక్‌భూతం అవహించింది.రోజువారీ వాడి పారేసిన వస్తువులు,భూమిలో పూర్తిగా కరిగిపోవడం,పచ్చని పొలాలపై దీని ప్రభావం పడుతోంది. రైతులు పండిరచే పంటలు దిగుబడి తగ్గిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణపై పరిపాలనలో మార్పులు రావాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గాలంటే దీని తయారి పరిశ్రమలను శాశ్వతంగా నియంత్రించాలి. అందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన,కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పర్చాలి.అలాగే పంచాయితీ స్థాయిలో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపుదిద్దేలాచర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి మార్పును ప్రజలు సైతం స్వాగతించకపోతే,కాలుష్యం,ప్లాస్టిక్‌ మానవ జీవితాన్ని మరింతగా కృంగదీసి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్. 

ఆర్ధిక నిఘా దాడులు అమానుషం

నా చిన్నప్పుడు, అంటే గత 50సంవత్సరాల క్రితం పలురకాల సామాజిక సమస్యలపై ప్రజాఉద్యమాలు నడిచేవి.తాగు,సాగునీరు,ప్రజల జీవనోపాధి,ప్రజావసరాలు,మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు ధర్నాలు,ర్యాలీలు,నిరసనప్రదర్శనలు చేసేవారు. ఇలా సమాజంలో ప్రజాజీవన విధానాలపైనే సామాజిక పోరాటాలు సాగేవి.సరళీకరణ,మిశ్రమ ఆర్ధిక విధానాలు పుణ్యమా అని ప్రస్తుతం ఆ ఉద్యమాలు దారిమళ్ళాయి. దళిత,గిరిజనుల భూములు కోల్పోవడం,స్థానిక వనరులు దోపిడి,పర్యావరణసమతుల్యం దెబ్బతినడం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను నిత్యం ప్రచార మాధ్యమాలు ద్వారా తెలుస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ,గిరిజన తెగలు నివాసించే అటవీప్రాంతాల్లో పెద్దపెద్ద పరిశ్రమలు,ప్రాజెక్టులు స్థాపన కోసం స్థానిక గిరిజనుల భూములు, వనరులు దోపిడికి గురికావడం వంటి తీవ్రమైనఅంశాల ఉద్యమాలు జరుగుతున్నాయి.నూతనఆర్ధిక విధానాలు తర్వాత ప్రైవేటీకీకరణ పెత్తనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి ప్రజల సామాజిక ఉద్యమాలు కాస్త పక్కదారి పట్టాయి.ప్రపంచీకరణనేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టినప్రాజెక్టులు,పరిశ్రమలవల్ల నిర్వాసితులైనప్రజలు,దెబ్బతింటున్న పర్యావరణసమతుల్యతపై పోరాటాలు నడుస్తున్నాయి.మిగతా ప్రజామౌళికావసరాలపై చేపట్టే సామాజికఉద్యమాలు తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో1991వరకు సామ్యవాద తరహా అక్కడ అక్కడా పరిశ్రమలు నెలకొల్పారు. కానీ ప్రైవేటీకరణ పెరగడంవల్ల వనరులు,పర్యావరణ సమస్యలతో ప్రజల పడుతున్న వెతలు వర్ణీతీతంగా మారాయి.మిశ్రమఆర్ధిక విధానం,సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడంవల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంలో పడిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసేవేయడం వంటి విధానాలవల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులురోడ్డున పడుతున్నారు. దీనికి తోడుగా గత రెండేళ్ళక్రితం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌`19 ఆంక్షలు స్థానిక ప్రభుత్వాలకు జతకట్టాయి.దీని ఆసరాగా తీసుకొని స్థానిక వనరులు,పర్యావరణ సమతుల్యతలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. పెట్టుబడులు ఉపసంహరణవల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థల(స్టీల్‌ ప్లాంట్‌ వంటి కంపెనీలు) పనితీరు మెరుగైన లాభాల బాట పట్టినప్పటికీ,శ్రామికులకు ఏమాత్రం మేలు చేకూరలేదు.ఫలితంగా బాధితుల ఒత్తిడి మేరకు సామాజిక, పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది.
ఈనేపథ్యంలో ఈఅంశాలపై పోరాటంచేసే వారిపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం ప్రయోగిస్తోంది. వారి నిరసన గళాన్ని అణిచివేసేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. వారిపై ఆర్ధిక నేర ఆరోపణ నెపంతో ఆర్ధిక నిఘా విభాగాలను ప్రయోగిస్తూ సరికొత్త తరహాలో దాడులు ప్రారంభించాయి. ఇలా ఇప్పటి వరకు దేశంలో సుమారుగా 300 మంది సామాజిక,పర్యావరణవేత్తలు,స్వచ్చంధ సంస్థలపై సోదాలు పేరుతో దాడులు చేపట్టాయి. టెర్రరిస్టులు తరహాలో వారిపై దాడులు చేసి భయాంబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంలో సామాజిక,పర్యావరణ పరిరక్షణ,మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలైన 1700మందిని హత్యలకు గురి చేసినట్లు నివేదకలు చెబుతున్నాయి.
ఇదింతా బడాపారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త లను భయాందోళనలకు గురిచేసి అడ్డుతొలగించుకోవడానికి స్థానికప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పెద్ద కుట్రలోని ఒక భాగమేనని ప్రజలు,పర్యావరణ,సామాజిక వేత్తలు భావిస్తున్నారు.-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

జీవనదులు..విలవిల!

భూమి వేడేక్కుతోంది.పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.ప్రకృతి విఫత్తులు పేట్రేగి పోతున్నాయి.హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతుంది. కర్ణాటక,పాకిస్తాన్‌లో వరద భీభత్సం, అడుగుంటితున్నజీవనదులు,చైనాలో కరువకాటకాలు. దీనికి కారణం వాతావరణంలో కనీవినీ ఎరుగని మార్పులు.ఇదికేవలం ఒక్క దేశానికే పరిమితం అయన అంశం కాదు.విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రధమ కారణం.ఈపెనుమార్పులుపై ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తున్నా..దేశంలో అనేకప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతులు యధేచ్ఛగా మంజూరు చేసేస్తోంది.
మరోపక్క హిమాలయాల్లో మంచుపర్వాతాలు కరిగిపోయి సముద్రమట్టం పెరిగిపోతుంది.ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పోనది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.యూరఫ్‌ పరిధి పది దేశాల గుండాపారే అతిపొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతుంది. జర్మనీ,నెదర్లాండ్‌,స్విట్జర్లాండ్‌ దేశాలకు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌నది పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా కోట్లాది మందినీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి. ఇక ప్రపంచ ప్రసిద్ద ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయోర్‌ నదిలో కూడా నీరు అతివేగంగా అడుగంటుతోంది.చైనా,అమెరికా,ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతోవాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడాగుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగాకోట్లాది మంది తాగు,సాగునీటికి అల్లాడుతున్నారు.నిత్యంఉధృతంగా ప్రవహించే చైనాలోనియాంగ్జీనది మరింత దుస్థితిలో ఉంది. ఇదిప్రపంచంలోనే అతిపెద్దనదిగా గుర్తింపు ఉంది. ఇదిలాంటే..స్పెయిన్‌,పోర్చుగల్‌ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల అక్కడ దట్టమైన అడవులు కాలిపోతున్నాయి.అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లక పోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్భన్‌ఉద్గారాలు పేరుకు పోంతోంది. ఫలితంగా ప్రకృతి సహజసిద్దమైనగుణాన్నికోల్పోయి భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది.ఇదింతా పర్యా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్రాజిల్లాల్లో నిక్షేపమైన నదీజలాలు ఇదేపరిస్థితి దాపురిం చనున్నట్లు సాంకేతాలుచవిచూస్తున్నాయి. దీనికికారణం ఇబ్బుడిముబ్బుడిగా ఇక్క పరిశ్రమలకు అను మతులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ప్రవహించే జీవనదులపై హైడ్రల్‌ ప్రాజెక్టులనిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.దీని నిర్మాణమంటూ జరిగితే భవిష్యుత్తులో ఇటు గిరిజనలు,అటు మైదాన ప్రాంతానికి తాగు,సాగునీటికి తీవ్రమైన విఘాతం ఏర్పడనుంది. పర్యావరణ పరిరక్షణ..నీటివనరుల సంరక్షణఅనే అంశంపై2005లో సమత ఉత్త రాంధ్రజిల్లాలో(శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం,తూర్పుగోదావరి)ల్లో ‘కొండల ఆరోగ్యమే.. పల్లపుప్రాంతాల సౌభాగ్యం’’అనే నినాదంతో చైతన్యయాత్ర చేపట్టాం.చెట్లు నరికేయడం,వెసులబాటు లేకుండాఖనిజాలు వెలికితీ స్తూపోతుంటే, భవిష్యత్‌ తరాలకు మన సంపదలు మిగలవని,పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదనుకోల్పోతే,వాటిని తిరిగి రాబట్టేందుకు కొన్ని సంవత్సరాలుతరబడి ఎదురుచూడాల్సి ఉంటుందనిఅనే ఈ యాత్ర ద్వారా ఆనాడే అవగాహన కల్పించాం. ఇది తెలిసినా స్వార్ధచింతనతో అటవీవృక్షాలను తెగనరికి ధ్వంసం రచనకు పూనుకుంటున్నారు.
ఇప్పటికైనా అడవులుఆరోగ్యంగా ఉంటేనేగిరిజన,మైదానప్రాంత రైతాంగానికి,ప్రజలకి సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తోంది. ఈవాస్తవాలు గ్రహించి సహజవనరుల పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌-

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక హర్షనీయం

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం.జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను,పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ,విశేషాధి కారాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలివ్యక్తిగా,తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..అణగారిన ఆదివాసీతెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగలు ప్రజలు, సామాన్యలు అనేక ఆశలు,ఆకాంక్షలు పెట్టుకున్నారు.ఇప్పటికైన తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు,వనరులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆదివాసీగిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే,ఈమధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తర్వాత మార్పులు వస్తున్నాయి. వాటిలో కొన్ని మంచిని కలిగించే మార్పులయితే,మరికొన్ని వారి ప్రాంతాలను,జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించుకోవడానికి నియమించబడిన భారత జాతీయ ఎస్టీ కమిషన్‌ పూర్తిస్థాయిలో నేటికీ భర్తీ కాలేదు.సగానికిపైగా ఖాళీలున్నాయి. ఆదివాసీ ప్రజ లను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి వారి గిరిజన ప్రజలసంపద, భూమి, అడవులు, సహజవనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఆదివాసీలను బలిపీఠం ఎక్కించేలా కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలతో అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సర్కార్‌ కొన్ని కొత్త నిబంధ నలను తెరపైకి తెచ్చింది. దేశంలోని ఖనిజ తవ్వకాలు,పునరుత్పాదక విద్యుత్‌,పర్యాటకం,వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవిబిడ్డలను అడవికి దూరం చేయడంతో వారంతా దోపిడికి గురవుతున్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా ఐదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసముండే గ్రామాలను నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 552 గ్రామాలు ఉన్నాయి.నాన్‌ షెడ్యూల్‌ ఏరియాను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలనే ఈ సమస్యతో గతకొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు.భూరియా కమిటీ సిఫార్సుల అనంతరం షెడ్యూల్‌ ప్రాంతాలను స్థానిక పాలనా కోసం కేంద్రప్రభుత్వం పంచాయితీ విస్తరణ చట్టం (పెసా)`1996 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సిపార్సుల్లో మెసా (మున్సిపల్‌ ప్రాంతాలవిస్తీరణ చట్టం)చట్టం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు మెసా చట్టం లేకుండానే కొన్ని గిరిజన ప్రాంతాలను మున్సిఫల్‌ పరిధిలోకి విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది. వాస్తవానికి గ్రామసభల ద్వారానే కొత్తవాటిని విలీనం చేసే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను గాలికి వదిలేసి ప్రభుత్వాలు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లా సరుగుడు పంచాయితీలోని కొన్ని గ్రామాలను విశాఖమెట్రో పాలిటిన్‌ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో విలీనం చేస్తున్నారు.దీనవల్ల గిరిజనుల మనుగడ ప్రశాన్నర్ధంగామారే ప్రమాదంఉంది.వారిసంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగే అవకాశాలు న్నాయి.ఈ విధంగా దేశంలోని పది రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల కొత్త రాష్ట్రపతి ముర్ము ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారనేదే ప్రస్తుతం కీలక ముఖ్యఅంశంగా మారింది. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిపీఠమెక్కిస్తున్న కేంద్రప్రభుత్వం తమ విశేషాధి కారాలను వినియోగించుకొని అడవిబిడ్డలను,ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ పునాదులను పరిరక్షిస్తారని ఆదివాసీ సమాజం ఎదురు చూస్తోంది.ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార’ని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి‍,ఎడిటర్

Read more
1 2 3 4