మళ్లీ కరోనా టెన్షన్‌

జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటి దాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్‌.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటిం చాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసు కోవాలని సూచిస్తున్నది. వైరస్‌ వల్ల తీవ్ర ఇబ్బందు లు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసు కోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్‌
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుం డటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతాను భవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబు తున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్‌ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ రకం వైరస్‌ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్‌ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంత ర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్‌-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు.ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజ రాత్‌ లోనే నమోదుకాగా, మరొ కటి ఒడిశా లో వెలుగులోకి వచ్చింది. జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28రోజుల్లో (డిసెంబర్‌ 21నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరి యాలో16 లక్షల కొత్త కేసులు,1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్‌ సోకింది.కోవిడ్‌ 19 వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9, 45,568 మందికి వైరస్‌ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్‌ పాలసీని సడ లించిన తరువాత చైనాలో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్‌ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పో యారు. ఆకస్మిక లాక్‌డౌన్‌ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయి లో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభు త్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదా పుగా 27శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్‌ డోస్‌ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్‌ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్‌ వేవ్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖాన ల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు చాలా మంది ప్రికాషన్‌ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు