భిన్న‌త్వంలో ఏక‌త్వం..మాన‌వ వాదం

మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడా ల్సిందే!! తప్పదు.. వస్తువులైనా,మనుషులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్నవారిని,పైకి లేచిన వారినీ, పైకి లేచి కింద పడినవారినీ, అందరినీ! ప్రపంచంలోని అన్యా యాన్ని చూస్తూ ఉండకూడదు.అది మన వెలు గుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకో గూడదు.. సహించగూడదు. ఆలక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి!
భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం.బౌద్ధ,జైన,సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సంద ర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవిం చాయి. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజంలను కూడా భారతదేశం స్వాగతించి అక్కున చేర్చుకున్నది. ఆ పరమే శ్వరుడు ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా ఇష్టపడతాడు. లేకుంటే సృష్టిలో తాను ఒకే కులాన్ని, ఒకే మతాన్ని ఏర్పరచి ఉండేవాడు. కానీ అలా చేయలేదే! కనుక భగవంతుని సంకల్పం మేరకే ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాదులు, జీవన విధానాలు, సంస్కృతులు, సాంప్ర దాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే మతానికి చెందిన వారైతే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయని ఎవరైనా భావిస్తే పొరపాటు అవుతుంది. సత్యదూరమే అవుతుంది. ఊహాజనితమైనదై, వాస్తవికతకు దూరంగా జరిగినట్లవుతుంది. ఇపుడు మానవాళి ముందున్న ప్రధాన సమస్య భిన్నమతాలు కాదు. నిజమైన సమస్యలు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, కరువు కాటకాలు మొదలైనవి. ఇవి మతాలు పరిష్కరించే సమస్యలు కావు. భిన్నత్వమనేది కేవలం మత సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కాదు. భగవంతుడు సృష్టి చేసినపుడు పిల్లి, కుక్క, నక్క ఉంటే చాలనుకోలేదు.84 లక్షల జీవరాసులను సృష్టిం చాడు. ఒకచోట రాత్రి,ఒకచోట పగలు, ఒక ప్రాం తంలో వేడి, మరో చోట ఎండ ఉన్నాయి. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేరకంగా లేవు. అంటే వైవిధ్యం సృష్టి ధర్మం. ఈ వైవిధ్యంలో,భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.వైవిధ్యభరితమైన సృష్టికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవం తుడే. భగవంతుని ఒక రూపానికి, నామానికి పరిమితం చేయకుండా సృష్టి, స్థితి లయలకు కారణభూతమైన విశ్వ చైతన్య శక్తిగా మనం గ్రహించగల్గితే సమస్యలుండవు. మానవ దేహానికి చైతన్యం ఉన్నంత సేపు ఆశరీరం శివం. అంటే మంగళకరం. దేహం నుండి చైతన్యం వెలుపలకు వెళ్లిపోతే శ్వాస ఆగిపోతుంది. చలనరహితమవుతుంది. అప్పుడు ఆశరీరాన్ని ఫలానా వారి పార్థివ శరీరమంటాం.ఒక శరీరానికి ఈ చైతన్యం ఎటువంటిదో సకల జగత్తుకూ అలా ఆధారభూతమైనది విశ్వ చైతన్య శక్తే. ఇదే విశ్వమంతటా నిండి నిబిడీకృతమైన ఏకత్వం. మనకు కంటికి కన్పించే, చెవికి విన్పించే అంశాలలో మాత్రమే భిన్నత్వం. కానీ నిత్య సత్యమైనది, భిన్నత్వంలోనున్న ఏకత్వమే (విశ్వ చైతన్య శక్తి). ఏకత్వం నుండే భిన్నత్వం ఆవిర్భవించింది. తుదకు భిన్నత్వమంతా ఏకత్వంలో సంలీనమవుతుంది. ఈనాడున్న అన్ని మతాలనూ మనం ఈ రీతిగానే చూడాలి. ఆరాధనా పద్ధతులను, ఆచారవ్యవహారాలను ఈ రకంగానే అవగాహన చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఏకత్వం ఏమిటంటే.. అవన్నీ కూడా ఉత్తమమైన జీవన విధానాన్నే ప్రబోధిస్తాయి. మానవతా విలువలకే ప్రాధాన్యమిస్తాయి. శాంతి సామరస్యాలనే వాంఛిస్తాయి. పరోపకారం, క్షమ, త్యాగనిరతినే అభిలషిస్తాయి. భేదమంతా సృష్టిని, సృష్టి యందున్న భిన్నత్వాన్ని, భిన్నత్వంలో గల ఏక త్వాన్ని అర్థం చేసుకోలేని సగటు మనిషి మదిలోనే ఉంది.ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కార వంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా’నవ’ వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ,వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అని మానవత్వంలేని వారు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్ళీ వేరే విషయం. సరే.. అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతి కష్టం మీద ఐదువేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌లోని న్యూ ఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయవ్యాధి – విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడటమే మానవత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయి వాసి అమన్‌, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుతష్యమైన ప్రదేశం… ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి,వచ్చి..పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రయంలో చేర్పించారు. అబద్దాలతో సోషల్‌ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి. కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మానవ వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడటానికి కానీ, అంత్య క్రియలు జరిపించడానికి గానీ అతని బంధు మిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసకోవడానికి మనతరంలో సగం జీవితం అయిపోయింది కదా?తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దానివల్ల సమాజ పురోగతి వేగం పుంజుకుంటుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డ దిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు..తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో వారెంత మాత్రమూ పట్టించుకోరు. 2014 అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఉద్యోం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీ తీసుకుని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్‌ ఆనందంలో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని,ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతిసామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళకంటే గొప్పవాడు.. సొబెరన్‌! అతను తోపుడు బండిపై కూర గాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓమాట చెప్పాడు. ‘’నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది’’ అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీ,దండ్రీ అన్నీతానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్పమీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆశిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక… అవకాశాలివ్వక… ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?చాలా మంది సీతాసాహూ అనే మహిళ పేరు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలంపిక్‌ మెడల్స్‌ తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? ఉత్త పుణ్యానికి భారతరత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన ఓ క్రికెట్‌ ఆటగాడి పేరు చెబితే.. దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటివారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్‌ చంద్ర చూడ్‌ 2018 ఆగస్టు30న ఒక మంచి వివరణ ఇచ్చారు..‘’ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీవాల్వు’ లాంటిది. దాన్ని అనుమతించకపోతే,ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్‌ కుక్కర్‌ పేలిపోతుంది!’’ అని. కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా,తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కావాలని డిమాండ్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏమతానికీ చెందమని స్పష్టం చేశారు.’ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణ నీయంగా పెరుగుతూ ఉందని’’ అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్‌ ప్రకటిం చారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజ నకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వా లకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్‌ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్‌ సంచల నం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్‌ అప్లికేషన్లలో ప్రింట్‌ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం! నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్‌ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలను కుంటే… మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘’ఫైవ్‌ మీల్స్‌, టూ సస్పెండెడ్‌’’ అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే… ఆ రెస్టారెంట్‌ వాళ్ళు వారికి భోజనం పెడతారు! ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడిగిన వారికి ‘’ఎనీ సస్పెండెడ్‌ కాఫీ’’ అని అడిగిన వారికి రెస్టారెంట్‌ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్‌ గౌరవభావంతో డొనేట్‌ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్‌వాళ్ళూ, పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో.. అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా? వెనకేసుకుందాం’ అనే వ్యాపార ధోరణీ, కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మంచి మనసు కూడా రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఉంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కృంగిపోక – హుందాగా ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై – సస్పెండెడ్‌ కాఫీ, టిఫిన్‌, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాట పడతారు కూడా! అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు…‘’కత్తిరించిన ఒత్తులే / వెలుగు తాయి దివ్యంగా-బాధా దగ్ధకంఠాలే పలుకు తాయి శ్రావ్యంగా’’ అని! అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం ఉందో తెలుసా? ఈ సమా జంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమా నతలు ఉండకూడదని మానవ జాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులూ కావాలి! ‘సేవ’ అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమా జాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకు పోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా. వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త