ప్లాస్టిక్‌ భూతం..అంతానికి పంతం

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి.వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తించేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపర చే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే.పర్యావరణం, ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరి స్తున్నా,ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు, రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులో ఉండే కాల్షియం,సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5 శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40 శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50 కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి.2030 నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050 నాటికి నాలుగింతలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3 టన్నుల ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌ అనేది ‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బ న్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజాయిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియం డిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు), బిస్పినాల్‌ లాంటి రసాయనాలు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి. ఈ రసాయనాలన్నీ సముద్ర జీవరాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవుతుంది.ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓ కార ణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5 నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం.మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతున్నాయి. వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జలమయ మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతున్నాయి. ఓ మోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాల యాల్లో, బేకరీలలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది. ఇలా క్యాన్సర్‌,ఉదరకోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.
ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి,ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళాలు, గ్లాసు లు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరాకులు,అరటిఆకులు,కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది. ప్లాస్టిక్‌ సంచులు వాడని హోటళ్ళను,కర్రీ సెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడలేము.టిఫిన్‌ నుంచి పచ్చడి,సాంబారు,కర్రీ అన్నీటిని ప్లాస్టిక్‌ సంచుల్లో కట్టి అందిస్తారు. ఇది మానుకోవాలి. సాంబారు రసం,కూరల కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాల ధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమానులు తినుబండారాలను స్టీలు డబ్బాలలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బా తిరిగి ఇచ్చిన వెంటనే డిపాజిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు.వాడి పడేసే ప్లాస్టిక్‌ పెన్నుల వల్ల కూడా పర్యావర ణానికి ముప్పు పొంచిఉంది.ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్నుల వినియోగం భారీ స్థాయిలో ఉంది.ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కెట్లో పర్యావరణ హితమైన పెన్నులు అమ్ముతున్నారు.ఈపెన్నులు వినియోగించిన తర్వాత భూమిలో నాటితే మొక్క వచ్చే వీలుగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయి పోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి. ఇది స్పూర్తివంతమైన, పెద్దలకు, పిల్లలకు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు,కిరాణ షాపులో సామాన్లు కొనేపుడు ప్లాస్టిక్‌ సంచీలు అడుగ కుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచులు తీసుకెల్లడం ఉత్తమం.చికెన్‌,మటన్‌ అమ్మే వ్యాపారస్తులు చాలా మంది 40మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు వాడుతున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీలు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాలయాల్లో ఒకపుడు గాజు,స్టీలు,గ్లాసులు వాడేవారు.ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు.ఈ పద్ధతి సరికాదు.టీలు,కాఫీలు గాజు,స్టీలు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాలు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాలు,పెరుగులను ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయి స్తుంటారు.ఏరోజుపాలు ఆ రోజు తెచ్చుకుని పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత నిల్వచేసుకోవాలి. వ్యాపారస్తులు 40 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ సంచులు వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్యసమస్యలు,పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ల సభ్యులను,కాలనీ కమిటీలను ప్రోత్సహించాలి.అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకో గలం.పాలకులు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు జౌళి సంచులు తయారీ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి. చెత్తకుండి ఉన్నదే చెత్తవేయడానికి మళ్ళీ అందులో పాలిథిన్‌ కవరు ఎందుకు?డబ్బాఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే,వారానికి ఆరు,నెలకు 24, సంవత్సరానికి 280 ఓజీవితకాలంలో కనీసం 22వేల పాలిథిన్‌ కవర్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.‘నోపాలిథిన్‌ హేజ్‌’ అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చుకోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవాల నుంచి తప్పించుకోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.– ` సైమన్‌ గునపర్తి