ప్రభుత్వ మోసాలకు పరాకష్ట 2019 తాత్కలిక బడ్జెట్‌

‘‘ ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్లలోకి జమ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపాదిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే ’’ – ధీర

రెండువేల పందొమ్మిది వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వివరాలు పరిశీలిస్తే 2014లో మొదలైన మోడీ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు పరాకాష్టకు చేరాయని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినంతసేపూ జాతీయ టెలివిజన్‌ ఛానెళ్లు అన్నీ ఆదాయ పన్ను రాయితీ, రైతు సహాయ పథకం, పెన్షన్‌ పథకం సరళీకర వంటి ఆకర్షణీయమైన హామీలను పదే పదే ప్రసారం చేశాయి. సమీప భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం అందించినంత సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని గొప్పలు చెప్పుకోవటం అప్పుడే మొదలైంది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తన ఉపన్యాసంలో బీజేపీ ప్రభుత్వం పన్నుల విధానంలో అమలు చేసిన సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగిందనీ, లక్షల కోట్ల ఆదాయం వచ్చిందనీ చెప్పుకొంది. కానీ వాస్తవాలు ఏమిటి? నిజంగా ప్రభుత్వం అంత గొప్ప సంక్షేమ బడ్జెట్‌ను ప్రతిపాదించిందా? వివిధ పథకాలకు కేటాయించిన నిధులు పెంచిందా? ప్రభుత్వ ఆదాయం పెరిగిందా అన్న మూడు ప్రశ్నలు వేసుకుంటే ఈ బడ్జెట్‌ ఉత్తిత్తిదే… అని ఘంటా పథంగా చెప్పవచ్చు.
ముందుగా రాబడి గురించి చూద్దాం. ప్రభుత్వం చెప్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుదల వల్ల దేశానికి ఒనగూడిరది ఏమీ లేదని రాబడి లెక్కలు పరిశీలిస్తే తేలుతుంది. జీఎస్టీ వల్ల పన్నుల ఆదాయం గొప్పగా పెరుగుతుందనీ ఆ విధంగా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలకు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టవచ్చన్నది బీజేపీ వాదన. కానీ పార్లమెంట్‌కు సమర్పించిన రాబడి లెక్కలు గమనిస్తే జీఎస్టీ వల్ల అదనంగా వచ్చిన ఆదాయం ఏమీ లేదని స్పష్టమవుతున్నది. జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పటానికి ఓ ప్రమాణం దిగుమతి సుంకాలు. ఆర్థిక వ్యవస్థ ఘనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చుకోవటానికి, వినిమయ అవసరాలు తీర్చుకోవటానికి దిగుమతులు పెరుగుతాయి. దిగుమతులు పెరగటం అంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలి. కానీ దిగుమతి సుంకాల ద్వారా వచ్చిన ఆదాయం 201-18ఆర్థిక సంవత్సరంలో లక్ష 28వేల కోట్లు అయితే 2018-19ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం లక్షా 26వేల కోట్లు. మరో సూచన కేంద్ర ఎక్సైజు సుంకాలు. 2017-18లో ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రెండు లక్షల 58 వేల కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రెండు లక్షల 59వేల కోట్లు మాత్రమే. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఈ పద్దు కింద వచ్చే ఆదాయం పెరగదు అని అంచనా వేశారు. ఈ రెండు పద్దులు గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ గొప్పతనం గురించి చెప్తున్న విషయాలు అన్నీ కాకమ్మ కబుర్లే అని తేటతెల్లమవు తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరగటానికి మరో మార్గం ప్రత్యక్ష పన్నులు. అంటే వేతన జీవుల మీద విధించే ఆదాయపు పన్ను. కంపెనీల మీద విధించే కార్పొరేట్‌ పన్ను. సంపన్నుల మీద విధించే సంపద పన్ను. ప్రభుత్వం వాగ్దానం ప్రకారమే ఇప్పటిరకు 2.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచారు. అంటే ఇప్పటి వరకు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తున్న వారిలో సగం మంది ఇక మీదట పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినా ఆదాయపు పన్ను పద్దు కింద కేంద్రానికి జమయ్యే ఆదాయంలో ఎటువంటి మార్పు లేదు…
ఆదాయపు పన్ను పరిధి పెంచిన తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య తగ్గిన తర్వాత కూడా అంతే మొత్తంలో ఆదాయపు పన్ను ఎలా వసూలు చేయాలో చార్టెడ్‌ అక్కౌంటెంట్‌, బీజేపీ రాజకీయ విరాళాలు వసూలుచేయటంలో దిట్ట అయిన పియూష్‌ గోయెల్‌కు మాత్రమే తెలిసిన విద్య. ఆర్థిక వ్యవస్థ ఆగమేఘాల మీద పురోగమిస్తున్నప్పుడు కార్పొరేట్‌ పన్ను పద్దు కింద వచ్చే ఆదాయం పెరగాలి. గత మూడేండ్లల్లో ఈ పద్దు కింద కేంద్రానికి వచ్చే ఆదాయంలో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవటాన్ని గమనిస్తే కార్పొరేట్‌ కంపెనీల మన్ననలు పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతగా ఆరాట పడుతుందో అర్థమవుతుంది. ఏటాప్రపంచ కుబేరుల జాబితాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్యచూసి సంస్కరణల గొప్పదనం గురించి జబ్బలు చరిచే ప్రభుత్వాలు సంపదపన్ను ద్వారా సేకరించే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయకపోవటం ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరిని తెలియచేస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల నుండి వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోయినా బడ్జెట్‌ మోతాదును మాత్రం పెంచేసింది బీజేపీ ప్రభుత్వం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 21,41,975 కోట్లు. 2018-9సంవత్సరానికి ఆశిస్తున్న ఆదాయం 24, 57,235 కోట్లు. కానీ2019-0 సంవత్సరంలో 27,84,200 కోట్లు సంపాదిం చాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేండ్లల్లో కేంద్రానికి వచ్చే స్థూల రాబడిలో ఎటువంటి మార్పు లేదు అంటేనే ఆర్థికాభివ ృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు దేశం ముందుంచుతున్న బడ్జెట్‌ గణాంకాలకు మధ్య పొంతన లేదని స్పష్టమవుతున్నది. అయినా ఈ సంవత్సరానికి అంటే 2019-20ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రాబడి గతేడాది కంటే దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ మొత్తాన్ని అప్పుల రూపంలో సేకరిం చాలని ప్రతిపాదించింది. అప్పు చేయటం కూడామోడీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుని దేశాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తాలని ప్రయత్నం చేయటం ఆర్థిక వ్యవస్థ గురించిన వాస్తవాలను మరుగున పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇది ఎన్నికల బడ్జెట్‌ అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రైతాంగానికి 60వేల కోట్ల రూపాయల రొక్కం అక్కౌంట్ల లోకి జమ చేయ బోతున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. 2008లో పంట రుణాల మాఫీ పథకం అమలుకు ఖర్చు చేసిన మొత్తం సుమారు 80 వేల కోట్లు. ఫలితంగా తర్వాతి మూడు నాలుగేండ్లు వ్యవసాయ రంగంలో ఎంతో కొంత కదలిక రావటానికి నాటి యూపీఏ అమలు చేసిన రుణమాఫీ పథకం పని చేసింది. కానీ ఇప్పుడు మోడీ ప్రతిపా దిస్తున్న తెలంగాణ మోడల్‌ రైతు సహాయ పథకం వ్యవసాయ రంగానికి ఎంత మేలు చేస్తుంది అన్నది ప్రశ్నార్థకమే. రక్షణ రంగానికి కేవలం 15వేల కోట్లు మాత్రమే (2.85 లక్షల కోట్లు నుంచి 3.05 లక్షల కోట్లు) పెంచి దేశ రక్షణకు ఎంతో సేవ చేస్తున్నట్టు చెప్పుకోవటం బీజేపీకి మాత్రమే చెల్లింది. ఈసంవత్సరం రక్షణ రంగానికి పెంచిన ప్రతిపాదిత కేటాయింపులు రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానికి ఇచ్చే సబ్‌ కాంట్రాక్టు విలువ కంటే తక్కువ అన్న విషయాన్ని గమనించాలి. ఈ పేరు మీద జాతీయ భావాలు రెచ్చగొట్టే ప్రయత్నమే కనపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటంలో ప్రధాన పాత్ర ఎరువుల సబ్సిడీది. కానీ ఈపద్దు కింద తాత్కాలిక బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా కేటాయించినది కేవలం ఐదువేల కోట్లు మాత్రమే. గతసంవత్సరం 70వేల కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 74,986కోట్లు ఖర్చు పెట్టాలని ప్రతిపాదించింది. ప్రభుత్వమే వాగ్దానం చేస్తున్నట్టు రైతుకి సహాయం పథకం ద్వారా వ్యవసా యరంగంలో భారీ కదలిక వచ్చి పెద్దఎత్తున సాగుభూమి విస్తరించే మాట నిజమే అయితే తదనుగుణంగా ఎరువుల సబ్సిడీ ఉండాలి. కానీ అత్తెసరు సబ్సిడీ పెరుగుదల గమనిస్తే ప్రభుత్వ వాగ్దానం మీద ప్రభుత్వానికే నమ్మకం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఆహారసబ్సిడీ కోసం అదనంగా కేటాయించింది 13వేల కోట్లు. మొత్తం ఆహారపు సబ్సిడీ కింద గత సంవత్సరం లక్షా 71 వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం లక్షా 84 కోట్లు కేటాయించింది.
పేద ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేశామని చెప్పు కుంటున్నా విశ్లేషణల్లో వాస్తవం ఏమీ లేదని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. గ్రామీణాబి óవృద్ధి, విద్య, వైద్య శాఖల పద్దుల్లో గుర్తించదగిన పెరుగుదల ఏమీ లేదు. ఉపాధిహమీ పథకానికి కేటాయింపులు గతమూడేండ్లల్లో ఎటువంటి పెరుగుదలకు నోచుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా గొప్పదని చెప్పుకున్న ఆయుష్మాన్‌ భవ పథకానికి (ఆరోగ్య సేవలు) కేటాయింపులు పెంచకపోవటాన్ని గమనిస్తే ఈ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదన్న సందేహం తలెత్తుతు న్నది. పేద మహిళల కన్నీళ్లు చూడలేక దీపం పథకం దేశవ్యాప్తం చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్‌ సబ్సిడీ కేటాయింపులు గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత తక్కువగా కేటాయించటం గమనార్హం. మొత్తంమీద గమనిస్తే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సాధించటానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గాలికొదిలి కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం అప్పులు చేసి మరీఖర్చు పెట్టడానికి సిద్ధమైందని స్పష్టమవుతూనే ఉంది. యూపీఏ 1 హయాంలో ఉపాధి హామీ చట్టం, రైతు రుణ మాఫీవాగ్దానాలు చేస్తే దిగాలుపడిన స్టాక్‌ మార్కెట్‌ అదే తరహా పథకాన్ని బీజేపీ ప్రకటిస్తే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సంబరాలు చేసుకోవటం వ్యాపార వర్గానికీ బీజేపీకీ ఉన్న అనుబంధాన్ని నిర్ధారించే సందర్భంగా నిలిచిపోతుంది.