తత్వవేత్త సర్వోన్నతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌

‘‘ ఎవని లీలవలన రాతినుండి కూడా అమృతం లభిస్తుందో అట్టి లక్ష్మీకాంతుడైన మహాగురువునకు నమస్కరిస్తున్నాను. అల్పబుద్దుల్కెన శిష్యులను సైతం మహా ప్రజ్ఞావంతులుగా మలచగల శక్తియుక్తులు గల గురువులకు నమస్కారము.’’

ా విద్యార్థుల కోసం గవర్నర్‌నే ఎదిరించారు
ా అరిటాకు లేక నేల మీదే అన్నం తిన్నారు
ా పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు

ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి,రాజ నీతి కోవి దుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్ర ప తిగా (1962 నుంచి67) పదవులకే వన్నెతెచ్చిన ‘భారత రత్నం’. ఆయనే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్ప డంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్ర లో శాశ్వత స్థానం కల్పించింది.‘తత్వవేత్తలు రాజ్యాధి పతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాం తులు విలసిల్లుతాయి’ అన్న గ్రీక్‌ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. ముందుగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాలను ఒకసారి స్పృశిద్దాం…

డిక్టేటర్‌ కంట కన్నీరొలికిన వేళ…
1949లో ఓఘట్టం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పట్లో సోవియట్‌ రష్యాకు రాధాకృష్ణన్‌ భారత రాయబారిగా వెళ్లారు. సాధారణంగా విదేశీ రాయ బారులకు స్టాలిన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఇష్టపడే వారు కాదు. అయితే రెండు సార్లు రాధా కృష్ణన్‌ను తనతో సమావేశానికి స్టాలిన్‌ ఆహ్వానించారు.1952లో స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్లిన రాధాకృష్ణన్‌ ఆయన తల నిమిరి, వీపుపై ఆప్యాయంగా చేయి వేసి పలకరించారు. ఆయన ఆత్మీయ స్పర్శతో పులకించి పోయిన స్టాలిన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. ‘అందరూ నన్ను ఓరక్తపిపాసిగా చూశారే కానీ, నాలో కూడా మనిషిని చూసిన తొలి వ్యక్తి మీరే. మీరు దేశం నుంచి వెళ్లిపోవడం నాకు చాలా విచారం కలిగిస్తోంది. నేను కూడా ఇక ఎంతో కాలం బతకను’ అంటూ ఆయన కంటతడి పెట్టారు. ఆతర్వాత ఆరు నెలలకే స్టాలిన్‌ కన్నుమూశారు.
విద్యార్థులే గుర్రపు బగ్గీ లాగారు…
రాధాకృష్ణన్‌ చెప్పేపాఠాలు, ప్రసంగాలు, ఆయన వ్యక్తి త్వం విద్యార్థులను ఎంతగానో ఉత్తేజపరచేవనడానికి మరోఘట్టం తార్కాణంగా నిలుస్తుంది. కలకత్తా కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరేందుకు రాధాకృష్ణన్‌ బయలుదేరినప్పుడు విద్యార్థులు బరువెక్కిన హృదయంతో ఆయనకు వీడ్కోలు చెప్పారు. మైసూరు యూనివర్శిటీ నుంచి రైల్వే స్టేషన్‌ వరకూ ఆయన వెళ్లేందుకు వీలుగా ఒక గుర్రపు బగ్గీని విద్యార్థులు ఏర్పాటు చేశారు. దానిని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన విద్యార్థులు స్వయంగా ఆ గుర్రపు బగ్గీని లాక్కుంటూ రైల్వేస్టేషన్‌ వరకూ తీసుకు వెళ్లి ఆయన పట్ల తమకున్న ఆరాధనను, గురుభక్తిని చాటుకున్నారు.విద్యార్థులే స్వయంగా ఆయనను ఊరేగిం పుగా తీసుకువెళ్లిన ఘట్టం నేటి విద్యార్థులకూ ఆదర్శ ప్రాయమే.
చదువంతా ఆ డబ్బుతోనే…
సర్వేపల్లి రాథాకృష్ణన్‌ 1888 సెప్టెంబర్‌ 5వ తేదీన తిరుపతి సమీపంలోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతుల కుమారుడైన రాథాకృష్ణన్‌తొలినాళ్లు తిరుత్తణి,తిరుపతిలోనేగడిచాయి. తండ్రి స్థానిక జమిం దార్‌ వద్దసబార్డినేట్‌ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాథాకృష్ణన్‌ ప్రాథమికవిద్య తిరుత్తణిలోని కెవి హైస్కూ లులో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్‌మన్స్‌బర్గ్‌ ఎవాంజిలికల్‌ లూథరన్‌ మిషన్‌ స్కూలు లోనూ, వాలాజీ పేట్‌లోని ప్రభుత్వ హైయర్‌ సెకండరీ స్కూలులోనూ జరిగింది. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌లతోనే జరిగిందంటే ఆయనలోని ప్రతిభ ఏమిటో అవగతం చేసుకోవచ్చు. పదహారేళ్ల ప్రాయంలో పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును రాథా కృష్ణన్‌ పెళ్లా డారు. వీరికి గోపాల్‌ అనే కుమారుడుతో పాటు ఐదు గురు కుమార్తెలు ఉన్నారు. కేవలం రూ.17 జీతంతో అతి కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు రాధాకృష్ణన్‌.
అరిటాకులు కొనలేక… నేల మీదే వడ్డించుకున్నారు
మహా తత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్‌ కడు పేదరికాన్ని అనుభవించారు.ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో అన్నం తినడానికి ఒక పళ్ళెం కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారు. ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవ డానికి కూడా డబ్బులేకపోతే, నేలపై నీటితో శుభ్రం చేసుకుని ఆనేలపైనే అన్నం వడ్డించుకుని తిన్నారు. ఆర్థికకష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పతకా లను అమ్ముకోవాల్సి వచ్చింది.
నా పుట్టినరోజు ఇలా కాదు… అలా గుర్తుండాలి !
విద్యార్థులను వారి కన్నతల్లిదండ్రులకంటే మిన్నగా ప్రేమించి, జ్ఞానదానం చేసిన రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయులు. వారి వాగ్దాటి, ఉపన్యాసాలు విద్యార్థులనే కాదు, పెద్దలనూ ఉర్రూత లూగించేవి. రాధాకృష్ణన్‌ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్‌ 5న ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థిం చారు. దీనికి ఆయన నవ్వుతూ ‘నా పుట్టిన రోజుకు బదులు ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది’ అని సూచించారు. అప్పట్నించి (1962) ఏటా రాధాకృష్ణన్‌ జన్మదినమైన సెప్టెంబర్‌5నఉపాధ్యాయ దినంగా దేశం జరుపుకొంటోంది.
విద్యార్థుల కోసం గవర్నర్‌కు చీవాట్లు…
తన విద్యార్థుల కోసం గవర్నర్‌తో సైతం ఘర్షణపడ్డారు రాధాకృష్ణన్‌.1942లో సుప్రసిద్ధ బెనారెస్‌ యూనివ ర్సిటీని మూసివేయించాలని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈయూనివర్సిటీ స్వాతం త్రోద్యమ పోరా టానికి కేంద్రంగా మారిందని, విద్యార్థులు తమ ప్రభు త్వానికి వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాట కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ఆగ్రహించిన నాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ సర్‌ మౌరీస్‌ ఏకంగా ఈవి ద్యాలయాన్ని మూయించాలని నిశ్చయించు కున్నాడు. విద్యార్థుల్ని శిక్షించాడు. నాడు బెనారెస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ అయిన రాధాకృష్ణన్‌ మౌరీస్‌ వద్దకు వెళ్లి సుమారు 20 నిమిషాల పాటు తన పదునైన మాటలతో అతని నోరు మూయించి ఆనిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు.
బహుమతి వస్తే.. అలా ఇచ్చేశారు !
ఈతత్వవేత్త బోధన జీవితాన్ని పరిశీలిస్తే… మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో తత్వ శాఖ అధ్యక్షు లుగా ఎదిగారు. 1929లో మాంచెస్టర్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అనం తరం ఆయన భారత దేశం తిరిగివచ్చి 1931 నుంచి 1936 వరకూ ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌గా పనిచే శారు. అదే ఏడాది, మళ్లీ 1937లోలిటరేచర్‌లో ఆయన నోబుల్‌ బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఆతర్వాత ఆయన బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో 1948 జనవరి వరకూ వైస్‌ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. వీరిఅద్వితీయ ప్రతిభను గుర్తించిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవి ద్యాలయం 1989లో రాధాకృష్ణన్‌ పేరిట విద్యార్థులకు ఉపకారవేతనాన్ని(Raసష్ట్రaసతీఱంష్ట్రఅaఅ జష్ట్రవఙవఅ ఱఅస్త్ర ూషష్ట్రశీశ్రీaతీంష్ట్రఱజూం)కూడా అందజేస్తోంది. అంతకుముందు తనకు వచ్చిన టెంపుల్‌టన్‌ ప్రైజ్‌ బహుమతి మొత్తాన్ని విద్యా సేవల కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయానికి ఇచ్చేశారు.
తత్వవేత్తగా బీజాలు…
రాయవెల్లూరులో బీఏ, మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో 1906లో ఫిలాసఫీలో ఎంఏ పూర్తిచేశారు రాధాకృష్ణన్‌. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సమీప బంధువుకు చెందిన ఫిలాసఫీ పుస్తకాలుచదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణు లయ్యారు. ఎంఏలో ఒకపరీక్షా పత్రంగా ‘దిఎథిక్స్‌ ఆఫ్‌ వేదాంత’అనేపరిశోథనా పత్రాన్ని సమర్పించారు. ఆయన అద్భుతమైన పరిశోథనా పత్రానికి అప్పటి ఫిలాసఫీ ప్రొఫె సర్‌ డాక్టర్‌ ఆల్‌ఫ్రెడ్‌ జార్జి హోగ్‌ ముగ్దుడయ్యాడు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఫిలాసఫీ అంటే రాధాకృష్ణన్‌ ఎంతో ఇష్టపడేవారు. ఆ స్ఫూర్తితోనే ఆయన తన రెండో పుస్తకాన్ని ‘ది రీజియన్‌ ఆఫ్‌ రెలిజియన్‌ ఇన్‌ కాంటెం పరరీ ఫిలాసఫీ’ని 1920లో తీసుకువచ్చారు. 1926లో గ్రేట్‌ బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ (ఆక్స్‌ఫర్డ్‌) యూనివర్శిటీలో చేసిన ఉపన్యాసాలను 1927లో ‘ది హిందూ వ్యూ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ప్రచురిం చారు. ఈ గ్రంథం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిది. ప్రత్యేకించి రాధా కృష్ణన్‌ మాంచెస్టర్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలం ఎంతో ముఖ్యమైనది. తత్వశాస్త్ర రంగంలో ఆయన మరింత ఎదగడానికి ఈనియామకం ఎంతగానే ఉపయోగపడిరది. భారతీయ తత్వశాస్త్రంపై వారు రచించిన ‘ఇండియన్‌ ఫిలాసఫీ’ అనే గ్రంథం భారతీయ తత్వశాస్త్రంపైనే కొత్త ఆలోచ నలు రేకిత్తించింది.
మనుమరాలితో క్రికెట్‌…
తత్వశాస్త్ర ప్రియుడైన డాక్టర్‌రాధాకృష్ణన్‌ నిరంతర అధ్య యనశీలి. గంభీర ప్రసంగాలు, ఆలోచనలతో మేధా వుల మధ్య ఎక్కువ సమయం గడిపేవారు. కానీ, చిన్నపిల్లలు కనిపిస్తే చాలు అంత మహామేధావి సైతం వారితో ఆటలాడేందుకు పోటీపడేవారు.
భోజనం ఎదురుగా ఉన్నా.. మంచినీరే తాగారు..
తత్వవేత్తగా తనకున్న విశిష్ట జ్ఞానంతో ఎదుటివారు మైమరిచేలా గంటలకొద్దీ అద్భుత ప్రసంగాలు చేయడమే కాదు, తాను తెలుసుకోవాల్సింది ఉందనుకున్నప్పుడు తినడానికి ఎదురుగా భోజనం ఉన్నా ఆసంగతి మరచి పోయి పక్కవారు చెప్పేది వింటూ ఆస్వాదించేవారు రాధాకృష్ణన్‌. ఒకసారి తన స్నేహితులైన హెచ్‌ జి వెల్స్‌, జోడ్‌, జేఎన్‌ సులివాన్‌ తదితరులతో కలసి రాధాకృష్ణన్‌ భోజనానికి కూర్చున్నారు. అందరూ తమ ఎదురుగా ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తూ శాస్త్రవిజ్ఞాన విషయాలపై మాట్లాడుతుంటూ రాధాకృష్ణన్‌ మాత్రం తన ఎదురుగా భోజనం ఉందన్న విషయం మరచి మంచినీరు తాగుతూ గంటల సమయం గడిపేశారు. విజ్ఞానాన్ని ఆస్వాదిం చడంలో రాధాకృష్ణన్‌ ఆసక్తిని గమనించిన ఆ స్నేహితు లు ఈ తత్వవేత్తకు ప్రణామం చేయడం తప్ప మరేం చేయలేకపోయారు.
పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు…
విద్యావేత్త, తత్వవేత్తగా విజయవంతమైన జర్నీ సాగించిన రాథాకృష్ణన్‌ ఆలస్యంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారం భించారు. 1931లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌… కమిటీ ఫర్‌ ఇంటలెక్చువల్‌ కో-ఆపేరేషన్‌కు నామినేట్‌ అయ్యారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూనెస్కోలో (1946-52) ఇండియాకు ప్రాతి నిథ్యం వహించారు. అనంతరం సోవియన్‌ యూని యన్‌కు భారత రాయబారిగా 1949 నుంచి 1952 వరకూ పనిచేశారు. 1952లో భారతతొలి ఉపరాష్ట్ర పతిగా ఆయన ఎన్నికయ్యారు. 1962 నుంచి 67వరకూ భారత రెండవ రాష్ట్రపతిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్ర్రెస్‌ పార్టీ నేపథ్యంకానీ, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం కానీ రాథాకృష్ణన్‌కు లేవు. ఏ పదవిలో ఉన్నా, ఏవ్యాపకంలో ఉన్నా భారతీయ తాత్విక విలువలను పాదుకొల్పడం, హిందూ ధర్మ విశిష్టతను తెలియజేయడమే ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఇక్కడొక ఆసక్తికరమైన నేపథ్యాన్ని చెప్పు కోవాలి. నిజానికి రాధాకృష్ణన్‌ పై చదువులకు వెళ్ళడం వారి తండ్రి వీరాస్వామికి ఇష్టముండేది కాదట. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తనకుమారుడు ఏదైనా ఆల యంలో పూజారిగా స్థిరపడాలని తండ్రి కోరుకునేవారట. అయితే, కుమారుడి అద్భుత ప్రజ్ఞ చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు. ఆ తండ్రి మనసు మారకుంటే మనం గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన ఈ ఉన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో.
రాజ్యసభలో రాధాకృష్ణన్‌.. ప్రధాని నెహ్రూకి పండుగ.. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభకు చైర్మన్‌ కూడా వ్యవహరిం చిన రాధాకృష్ణన్‌ చైర్‌లో ఉన్నారంటే నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆ సెషన్స్‌ని మిస్‌ అయ్యే వారు కాదని చెబుతుంటారు. ఎందుకంటే, విద్యావేత్త, తత్వవేత్త అయిన రాధాకృష్ణన్‌ సభాధ్యక్షునిగా ఉన్నప్పుడు సభను నడిపించే తీరు నెహ్రూకు ఎంతో నచ్చేది. వాడి వేడి వాదనలతో సభ వాతావరణం గంభీరంగా మారినప్పుడు, వివిధ పార్టీల సభ్యులు పరస్పరం వాదనలకు దిగి తమ ప్రసంగాలతో తీవ్రమైన భావావేశాలకు లోనైనప్పుడు రాధాకృష్ణన్‌లోని తత్వవేత్త బయటకు వచ్చేవారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బైబిల్‌ తదితర గ్రంథాలలోని సూక్తులతో సభ వాతావరణాన్ని ఆయన పూర్తిగా చల్లబరి చేవారు. ఇది గమనించిన నెహ్రూ స్పందిస్తూ… రాధా కృష్ణన్‌ పార్లమెంట్‌లో ఉన్నారంటే ఆసెషన్స్‌ కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ కలయికగా మారిపో తాయని తరచూ చెప్పేవారు. సభలో రాధాకృష్ణన్‌ ప్రస్తా వించే వేదాంత సూక్తులు, తత్వ సంబంధ వ్యాఖ్యలు నెహ్రూనే కాదు సభ్యులందరినీ అమితంగా ఆకట్టు కునేవి.
పురస్కారాలకే వన్నె తెచ్చారు…
ప్రతిభావంతులకు పురస్కారాలు మరింత వన్నెతెస్తాయి. అయితే పురస్కారాలకే వన్నె తెచ్చిన క్రెడిట్‌ రాథాకృష్ణన్‌దే. 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం రాథాకృష్ణన్‌కు ‘సర్‌’ బిరుదు ప్రదానం చేసింది. 1963లో టెహ్రాన్‌ విశ్విద్యాలయం గౌరవ పీహెచ్‌డి, అదే ఏడాది నేపాల్‌లోని త్రిభువన్‌ విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్‌, 1963లో పెన్సిల్వే నియా యూనిర్శిటీ డాక్టర్‌ ఆఫ్‌ లా, 1964లో సోవి యట్‌ యూనియన్‌ గౌరవ డాక్టరేట్‌ ఆయనకు ప్రదానం చేశాయి. బ్రిటన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ 1963లో ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ గౌరవ పురస్కారాన్ని రాథాకృష్ణన్‌ అందుకున్నారు. అన్నింటికీ మించి భారత ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును 1954లో ప్రదానం చేసి ఆఅవార్డుకే వన్నె తీసుకువచ్చింది.
వివిధ రంగాలకు రాధాకృష్ణన్‌ అందించిన సేవలను తలుచుకుంటూ నాటి నుంచి నేటి తరాల వరకూ స్ఫూర్తి పొందుతూనే ఉన్నాయి. సమాజ కళ్యాణం లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్త ఘన్‌శ్యాందాస్‌ బిర్లాతో కలసి మరిందరు సామాజిక వేత్తల తోడ్పాటుతో కృష్ణార్పణ్‌ చారిటీ ట్రస్ట్‌ నెలకొల్పారు. 1967లో రాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందాక మద్రాసులోని తన నివాసం ‘గిరిజ’లో ఆనందంగా గడిపారు. రాష్ట్రపతిగా మూడ వసారి పదవిని నిర్వహించమని కోరినా వద్దన్నారు. 1975లో ఏప్రిల్‌ 17న 86 ఏళ్ల ప్రాయంలో రాధాకృష్ణన్‌ కన్నుమూశారు.
మహాత్మా గాంధీచే ప్రారంభించబడిన క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రేరేపితులైన శ్రీ రాధాకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి ఆంగ్లేయుల గుండెలలో సింహ స్వప్నంగా నిలిచారు. స్వాతంత్య్రం పచ్చిన తరువాత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఆయన తరువాత రాష్ట్రపతిగా కూడా నియమితులై ఆ పదవులకు వన్నె తెచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఎన్నో విలువైన సూచనలు సలహాలు చేసారు.
తన జీవిత పర్యంతము విద్యకై, తత్వ సాధనకై, విలువల ఉపాధ్యాయ వృత్తికై అవిరళ కృషి చేసిన శ్రీ రాధాకృష్ణ జన్మ దినోత్సవమును ఉపాధ్యాయ జన్మదినోత్సవంగా ప్రభుత్వం 1975వ సంవత్సరం నుండి నిర్వహిస్తోంది. నాటి నుండి దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థ లన్నీ ఉపాధ్యాదినోత్సవమును ఘనంగా నిర్వహిం చటం జరుగుతోంది. ఆ దినమున ఉపాధ్యాయ వృత్తిలోని మేటి ప్రముఖులను గుర్తించి వారిని యథాశక్తి సత్కరించుకోవటం జరుగుతోంది. భారత దేశమంతా గర్వంగా ఆనందోత్సాహాలతో జరిగే గురుపూజోత్సవం సందర్భంలో మహోన్నత వ్యక్తిత్వ,మానసిక,దార్శనిక,ఆధ్యాత్మిక తత్త్వవేత్త జన్మ దినం జరుపుకోవడం ఆ మహా మనీషికి ఇస్తున్న ప్రత్యేకమైన గౌరవం.నీతివంతమైన జీవన వర్తనతో సమ సమాజ స్థాపనకు కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన వందనం. -డా.దేవులపల్లి పద్మజ