పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల భ్రమ

పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగు పడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడి దారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. పెట్టుబడిదారీ విధానం మొదలైన తొలి కాలం లో అది నిరుద్యోగాన్ని పెంచుతుందని, దాని వలన పేదరికం పెరుగుతుందని…కాని, మొదట్లో కలిగిన ఈ నష్టాన్ని ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతున్న కాలంలో పూడ్చివేస్తుందని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మొదట్లో ఉపాధి పోగొట్టుకున్నవారంతా ఆ తర్వాత కాలంలో ఉద్యోగాలు పొంది కార్మికులుగా తిరిగి పనుల్లో చేరుతారని, నిరుద్యోగం తగ్గడంతో వేతనాలు పెరగడం ప్రారంభమౌతుందని, వేతనాలు పెరుగుతున్న కొద్దీ కార్మికుల ఉత్పాదకత కూడా పెరుగు తుందని వారు భావిస్తారు. గత చరిత్ర అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నట్టు పైకి చూస్తే అనిపిస్తుంది కూడా. మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ అంచనా ప్రకారం పారిశ్రా మిక పెట్టుబడిదారీ విధానం మొదలైన తర్వాత బ్రిటన్‌ లో నిరుద్యోగం పెరిగింది. కాని 19వ శతాబ్దపు నడిమి కాలం నాటికల్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి. కార్మిక వర్గానికి అనుకూలంగా మారాయి. ఈ విధమైన దృక్పథం ఉంటే పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం వలన కార్మికులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి అన్న నిర్ధారణకి వస్తాం.ఈ విధమైన అవగాహన మొత్తంగానే తప్పు. పెట్టుబడిదారీ విధానం తాను తొలుత కార్మికవర్గానికి కలిగించిన నష్టాన్ని ఆ తర్వాత కాలంలో పూడ్చి వారికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తుంది అని భావించడానికి ఎటువంటి సిద్ధాంత ప్రాతి పదికా లేదు. కార్మికుల స్థితిగతులలో తర్వాత కాలంలో కనిపించిన మెరుగుదలకు, పెట్టుబడి దారీ విధానపు సహజ సద్యోజనిత స్వభావానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇంగ్లీషు ఆర్థిక శాస్త్రవేత్త డేవిడ్‌ రికార్డో పరిశ్రమల్లో యంత్రా లను వినియోగించడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఈ విధమైన వాదన ముందుకు తెచ్చాడు. మొదట్లో యంత్రాల వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కష్టాలపాలౌతారని, కాని ఆ తర్వాత లాభాలరేటు పెరిగి పెట్టుబడి ఎక్కువగా పోగుబడుతుందని, దానితో మరిన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, వాటిలో గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారందరికీ మళ్ళీ ఉపాధి లభించడమేగాక వారి స్థితిగతులు బాగా మెరుగు పడతాయని రికార్డో ప్రతిపాదించాడు. కార్మికుల జనాభా మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండేవిధంగా వాళ్ళు తమను తాము నియంత్రించుకుంటే వారి వేతనాలు పెంచుకోవచ్చునని కూడా ఆయన చెప్పాడు. రికార్డో వాదనలో రెండు లోపాలు ఉన్నాయి. పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది ఒకే ఒక్కమారు జరిగే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త కొత్త యంత్రాలను, నూతన ఉత్పత్తి ప్రక్రి యలను ప్రవేశపెట్టడం అనేది నిత్యం జరుగుతూనే వుంటుంది. యంత్రాలను మొదట ప్రవేశపెట్టినప్పుడు పెట్టుబడిదారుల లాభాల రేటు పెరగడం అనేది జరిగినా, వారి వద్ద పెట్టుబడి ఎక్కువగా పోగుబడినా, దాని ఫలితంగా అంతకు ముందు కోల్పోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ రావడం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ లోపునే మళ్ళీ కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగిపోతూ వుంటుంది. అందుచేత ఈ విషయాన్ని నిరంతరం మారుతూ వుండే క్రమంలోనే చూడాలి. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి వృద్ధి చెందే రేటు ‘జి’ అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి వృద్ధిరేటు కూడా ‘జి’ యే ఉంటుంది (ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం పెంచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టినా, దాని వలన శ్రామికులకు చెల్లించే వేతనాలు ఆ మేరకు తగ్గుతాయే కాని ఉత్పత్తి అయ్యే సంపదలో వృద్ధిరేటు మాత్రం పెట్టుబడిలో వృద్ధిరేటు ఎంత ఉంటుందో, అదే మోతాదులో ఉంటుంది). శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటు ‘పి’ అనుకుందాం. అప్పుడు అదనపు కార్మికుల అవసరం పెరిగే రేటు జి-పి ఉం టుంది. కార్మికుల జనాభా పెరిగే రేటు ‘ఎన్‌’ అనుకుంటే జి-పి కన్నా ఎన్‌ తక్కువ ఉన్నప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోజి-పి విలువ ఎన్‌ ను దాటి ఉండేట్టు చూసే ఏర్పాటు ఏదీ లేదు. కార్మికుల ఉత్పా దకత పెరుగుతూ మరోవైపు నిరుద్యోగం రేటు కూడా పెరుగుతూ వుంటే (అప్పుడు వేతనాల రేటు కనీస స్థాయిలోనే ఎప్పుడూ ఉండిపో తుంది) లాభాల రేటు పెరుగుతూ పోతుంది. దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుంది. దానిని వినియోగించినప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు నిరుద్యోగం పడిపోతుంది.- రికార్డోను సమర్ధించేవారి వాదన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే రికార్డో వాదనలోని రెండో సమస్య ముందుకొస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయే సరుకులకు డిమాండు ఎప్పుడూ పెరుగుతూనే వుంటుంది అని రికార్డో భావించాడు. అందువలన ఉత్పత్తి పెరిగితే దాని ఫలితంగా లాభాలు పెరుగుతాయని, దానివలన అదనపు పెట్టుబడి పోగుబడు తుందని, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకమూ ఉండదని అతను భావించాడు. ‘’సరుకులు ఎంత ఎక్కువగా మార్కెట్‌ లోకి వస్తే అంత ఎక్కువ డిమాండ్‌ వాటికి ఉంటుంది’’ అన్న సూత్రాన్ని అతను విశ్వసించాడు. కాని లాభాలు రావాలంటే ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. అవన్నీ అమ్ముడు పోయినప్పుడే వాస్తవంగా పెట్టుబడిదారుడికి లాభం పోగుపడుతుంది. ఉత్పత్తి అయిన సరుకులన్నీ అమ్ముడుపోవాలంటే అది కొనుగోలు శక్తిని బట్టి ఉంటుంది. కొనుగోలుశక్తి వేతనాల రేటుని బట్టి ఉంటుంది. మరి వీలైనంత తక్కువ స్థాయిలో వేతనాలను ఉంచాలని పెట్టుబడి దారులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్కెట్‌ లో డిమాండ్‌ నిరంతరం పెరగడానికి గ్యారంటీ ఏమిటి? అందుచేత సాంకేతిక పరి జ్ఞానం పెరిగి దాని ఫలితంగా నిరుద్యోగం పెరిగితే, ఆ విధంగా ఉద్యోగాలను పోగొట్టు కున్నవారిని తిరిగి ఉద్యోగాలలో పెట్టుకోడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎటువంటి ఏర్పాటూ లేదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ప్రారంభదినాల్లో కార్మికులకు నష్టం కలిగిం చినా, తర్వాత అది పుంజుకున్నాక కార్మికులకు మేలు జరుగుతుందన్న రికార్డో వాదనకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.కాని వాస్తవ చరిత్ర చూస్తే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాక అక్కడి కార్మికుల స్థితి గతులు మెరుగుపడ్డాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? యూరప్‌ ఖండం లోని కార్మి కులు చాలా భారీ సంఖ్యలో ‘’కొత్త ప్రపంచానికి’’ (అంటే అమెరికా ఖండానికి) వలసలు పోయారు. ఈ వలసలు మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా (1914) కొనసాగాయి. 19వ శతాబ్దంలో నెపోలియన్‌ యుద్ధం నాటినుండి మొదటి ప్రపంచయుద్ధం దాకా మధ్య కాలంలో దాదాపు 5కోట్ల మంది యూరోపియన్‌ కార్మికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వలసలు పోయారని ఆర్థికవేత్త ఆర్థర్‌ లూయిస్‌ అంచనా వేశాడు. ఈ వలసలు ‘’అధిక వేతన’’వలసలు. అంటే ఆ కార్మికులు అంతవరకూ ఉండిన స్వస్థలాల్లోనూ, అదే విధంగా వాళ్ళు వలసలు పోయిన కొత్త ప్రదేశాల్లోనూ వేతనాలు అధికస్థాయిలో ఉన్నా యి. ఇదే కాలంలో ‘’అల్ప వేతన’’ వలసలు కూడా మరోవైపు కొనసాగాయి. ఈ రెండో తరహా కార్మిక వలసలు ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలైన ఇండియా, చైనా వంటి దేశాల నుండి ఫిజీ, మారిషస్‌, వెస్ట్‌ ఇండీస్‌, తూర్పు ఆఫ్రికా, నైరుతి అమెరికా వంటి ఉష్ణ, సమశీ తోష్ణ ప్రదేశాలకు జరిగాయి. ఇక్కడ ఆ కార్మి కుల స్వంత దేశాలలోనూ, వాళ్ళు వలసలు వచ్చిన దేశాల్లోనూ వేతనాల స్థాయి తక్కువగానే ఉంది. ఈ కార్మికులను శ్వేతజాతి కార్మికులు వలసలు వచ్చిన ప్రదేశాలకు రానివ్వలేదు (ఇప్పటికీ కోరుకున్న వారందరినీ అక్కడికి వలసలు రానివ్వడం లేదు). ఇలా ఒకవైపు అధిక వేతన వలసలు, మరోవైపు అల్పవేతన వలసలు ఎందుకు జరిగాయి? దీనికి లూయిస్‌ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ కాలంలో బ్రిటన్‌ లో వ్యవసాయ విప్లవం జరిగి, తక్కిన యూరప్‌కంతటికీ విస్తరించింది అని, దాని వలన గ్రామీణ కార్మికులకు యూరప్‌ లో ఆదాయాలు బాగా పెరిగాయని అతను అన్నాడు. కాని ఆ విధమైన వ్యవసాయ విప్లవం ఏదీ బ్రిటన్‌ లో జరిగిన దాఖలాలు లేవు. మరి అసలు కారణం ఏమిటి? అధిక వేతన వలసల విషయంలో జరిగినదేమంటే యూరప్‌ నుండి వలసలు పోయినవారు అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలలోని స్థానికులను వారి వారి భూముల నుండి తరిమివేసి ఆక్రమించుకుని వ్యవసాయదారులుగా స్థిరపడి అధిక ఆదాయాలు ఆర్జించసాగారు. మరోవైపు యూరప్‌ లో కార్మికవర్గం సంఖ్య వలసల కారణంగా తగ్గిపోయింది. అందుచేత ఇక్కడ కూడా కార్మికుల వేతనాలను పెంచక తప్పలేదు. ఒక శీతల దేశం నుండి మరొక శీతల దేశానికి జరిగిన వలసలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1820 నుండి 1915 మధ్య బ్రిటన్‌ లో ఎంత మేరకు జనాభా పెరిగిందో, అందులో సగం మేరకు అక్కడి నుండి వలసలు పోయారు. ఇటువంటి స్థాయిలోనే మన దేశంలో కూడా వలసలు జరిగివుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివకూ దాదాపు 50 కోట్ల మంది వలసలు పోయివుండాలి (యూరప్‌ లో జరిగిన వలసల ప్రభావం ఎంత బలంగా ఉండిరదో బోధపడడానికి ఈ పోలిక చూపడం జరిగింది.). ఆ విధంగా ఇతర దేశాలకు తరలిపోవడానికి యూరోపియన్‌ కార్మికులకు లభించిన అవకాశాలు వారి స్థితిగతులు బాగా మెరుగుపడడానికి దోహదం చేశాయే తప్ప పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి క్రమంలో స్వత:సిద్ధంగా కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచే ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఇలా వేరే దేశాలకు పోయి అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకునే అవకాశం సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావం నుంచి వచ్చింది.సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా సంపన్న దేశాలలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వచ్చింది. ఇది కేవలం స్థానికుల నుండి భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే కాదు. సంపన్న దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండ్‌ కల్పించడానికి, తద్వారా సంపన్న దేశాలలో అదనపు ఉద్యోగాలు కల్పించడానికి సామ్రాజ్యవాదులు తాము ఆక్రమించుకున్న వలసలలో చేతివృత్తిదారులను, చిన్న తరహా ఉత్పత్తిదారులను భారీ స్థాయిలో దెబ్బ తీశారు. అంటే ఒకవిధంగా సామ్రాజ్యవాదం సంపన్న దేశాలలోని నిరుద్యోగాన్ని వలస దేశాలలోకి ఎగుమతిచేసిందన్నమాట. ఆ వలస దేశాలకు తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోగలిగిన సత్తా లేదు. అవన్నీ సంపన్న దేశాల ఆధీనంలోనే ఉండేవి. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్‌ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు ఇలానే ఉంటుంది. వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)